హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, తాజా మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులకు ప్రభుత్వం గన్మెన్లను ఉపసంహరిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాజీనామా చేసిన పదిహేడు మంది నేతలకు గన్మెన్లను ప్రభుత్వం తొలగించింది. దీంతో మంగళవారం ఉదయం నుండి తాజా మాజీలకు గన్మెన్లు అందుబాటులో లేరు.
గన్మెన్ల తొలగింపుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మండిపడింది. కక్ష సాధింపు చర్యలో భాగంగానే గన్మెన్లను తొలగించారని ఆరోపించారు. రైతుల కోసం పదవులు వదులుకున్న తాము గన్మెన్లను తొలగిస్తే భయపడతామనుకోవడం పొరపాటమని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
ప్రజల అండదండలే తమకు శ్రీరామరక్ష అని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ఇంత నీచ రాజకీయాలకు దిగజారుతుందని తాము అనుకోలేదని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన వచ్చే ఉప ఎన్నికలలో అన్ని స్థానాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధిస్తుందని శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు అన్నారు. జగన్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
కాగా విశాఖ జిల్లా గాజువాకకు చెందిన ప్రముఖ కాంగ్రెసు నేత గన్ రెడ్డి రామునాయుడు మంగళవారం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు దాదుపు 46 మంది కాంగ్రెసు, టిడిపి పార్టీల నుండి వైయస్సార్ కాంగ్రెసులో చేరారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చని దద్దమ్మ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మంగళవారం ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో విమర్శించారు. వైయస్ రెక్కల కష్టం మీద గెలిచిన ఈ ప్రభుత్వం పెద్దలు ఇప్పుడు ఆయననే విమర్శించాలనుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెసు నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. పిసిసి చీఫ్, సిఎం గొడవకు సిన్సియర్ అధికారి బలవ్వడం అన్యాయమన్నారు. కేంద్రం సిబిఐని, రాష్ట్రం ఎసిబిని ప్రత్యర్థుల పైకి ప్రయోగిస్తోందని ఆరోపించారు.
No comments:
Post a Comment